DC vs MI: తొలి ఓటమిని చవిచూసిన ఢిల్లీ.. మ్యాచ్‌నే మార్చేసిన రనౌట్లు.! 10 d ago

featured-image

IPL 2025లో భాగంగా నిన్న జరిగిన డబుల్ హెడ్డేరు మ్యాచ్‌లలో రెండవ మ్యాచ్‌గా ముంబై ఇండియన్స్ (MI).. ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 3 బంతుల్లో ఆట స్వభావమే పూర్తిగా మారిపోయింది. చివరి వరకు ఢిల్లీ దే అనుకున్న మ్యాచ్.. వరుసగా 3 రనౌట్లతో ముంబై ఫేటే మారిపోయింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ రెండవ స్థానానికి పడిపోయింది. 


టాస్ ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. బ్యాటింగ్ కు దిగింది. అయితే రోహిత్ శర్మ (18) తక్కువ పరుగులకే వెనుతిరిగాడు. ర్యాన్ రికెల్టన్ (41) గట్టిగా నిలబ‌డటంతో పవర్ ప్లే లో MI జట్టుకు మంచి ప్రారంభం లభించింది. రోహిత్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (40) కూడా మెరుపులు పుట్టించాడు. తిలక్ వర్మ (59) రాణించడంతో భారీ స్కోర్ అంచనాలు తలెత్తాయి. అయితే హార్దిక్ పాండ్యా 2 పరుగులకే ఔట్ అయ్యాడు. నమన్ ధీర్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 17 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. దీంతో MI నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.


భారీ లక్ష్యంతో దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఖాతా తెరవకుండానే.. ఢిల్లీ వికెట్ కోల్పోయింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరుణ్ నాయర్ ఇంపాక్ట్ చూపించాడు. వరుస పెట్టి బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. గ్యాప్ వచ్చిన కూడా.. క్లాస్ లో ఏమాత్రం మార్పు రాలేదు. వచ్చిన ప్రతి బౌలర్ ని కూడా వదలలేదు... చివరికి బుమ్రాను కూడా కొట్టాడు. 40 బంతుల్లో 12 ఫోర్‌లు, 5 సిక్సులతో 89 పరుగులు చేసాడు.


ఒక దశలో మ్యాచ్‌ని వన్-సైడ్ చేసేసాడు. అభిషేక్ పోరెల్ (33).. కరుణ్ నాయర్ ఔట్ అయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన కేఎల్ రాహుల్ (15), అక్షర్ పటేల్ (9), ట్రిస్టన్ స్టబ్స్‌ (1) నిలకడగా ఆడలేక పోయారు. కానీ అశుతోష్ శర్మ (17).. విప్రాజ్ నిగమ్ (14) క్రీజులో ఉండటంతో ఢిల్లీ విజయంపై ఆశలు వదులుకోలేదు. ఇక మ్యాచ్ ఢిల్లీ దే అనుకున్న సమయంలో.. సీన్ రివర్స్ అయ్యింది.

19వ ఓవర్‌లో ముంబై జట్టు వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మలు ఔటయ్యారు. దీంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు అజేయంగా ఉన్న ఢిల్లీ జట్టు ఈ టోర్నీలో తొలి ఓటమిని చవిచూసింది. ముంబై తరుపున కీలకమైన 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు. 


టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని ఏకనా స్టేడియంలో సాయంత్రం 7:30కి ప్రారంభమవుతుంది.


Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD